MLC Election | 'వరంగల్, ఖమ్మం, నల్గొండ' పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈసీ మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల సంహరణకు మే 13 వరకు గడువు విధించింది.
MLC Election : ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈసీ మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల సంహరణకు మే 13 వరకు గడువు విధించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కానున్నారు. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు.
కాగా 2021లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ’ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి.
ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్ఓటర్లుగా నమోదు చేసుకునే గడువు పూర్తవడంతో తాజాగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. 2021లో మల్లన్న ఇండిపెండెంట్గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు.