నా బ‌లం నా నాన‌మ్మ‌: రాహుల్‌

నా బ‌లం నా నాన‌మ్మ‌: రాహుల్‌
  • మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 39వ వర్ధంతి
  • సందర్భంగా శక్తి స్థల్‌లో కాంగ్రెస్ నేత‌ల ఘన నివాళి


విధాత‌: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 39వ వర్ధంతి సందర్భంగా మంగ‌ళ‌వారం దేశ రాజధాని ఢిల్లీలోని శక్తి స్థల్‌లో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.


“నా బలం, నా నాన‌మ్మ. మీరు అన్నింటినీ త్యాగం చేసిన భారతదేశాన్ని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను. మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతో, నా హృదయంలో ఉంటాయి” అని రాహుల్ గాంధీ X (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. కాగా, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ తన నానమ్మ నిజంగా ‘మదర్ ఆఫ్ ది నేషన్’ అని గుర్తు చేసుకున్నారు.


“సాటిలేని ధైర్యానికి, పోరాటానికి ప్రతీక. ప్రజాస్వామ్య సోషలిజానికి మార్గదర్శకురాలు మా అమ్మమ్మ, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు సెల్యూట్” అని వరుణ్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా భారత మాజీ ప్రధానికి నివాళులర్పించారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాళి సందేశంలో, బలమైన, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించడంలో ఇందిరా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.