Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..ఫిరాయింపులో మరో ట్విస్టు !

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొనడం ఫిరాయింపుల కేసులో మరో సంచలన ట్విస్టుగా మారింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jan 30, 2026, 4:30 pm IST
Read Time: 4 mins
Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..ఫిరాయింపులో మరో ట్విస్టు !

విధాత : గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో పాల్గొని ఫిరాయింపుల వివాద పర్వంలో మరో ట్విస్టు ఇచ్చారు. బండ్ల కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలో పాల్గొనడమే కాకుండా వారిని గెలిపించాలంటూ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ ను, సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా తాను పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదని, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ బండ్ల అఫిడవిట్ సమర్పించారు. అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవంటూ, వారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ అనర్హత పిటిషన్ ను కొట్టివేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చారు. స్పీకర్ తీర్పుకు భిన్నంగా ఈరోజు గద్వాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని స్పీకర్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాలో విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఇంకా అనర్హత కేసు విచారణ పెండింగ్ లోనే ఉండగానే..కోర్టులో, స్పీకర్ ముందు చేసిన వినిపించిన వాదనకు భిన్నంగా బండ్ల కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న తీరు రాజ్యాంగ వ్యవస్థల డొల్లతనాన్ని చాటుతుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

వినియోగదారులకు అలర్ట్‌.. ఫాస్టాగ్‌ రూ‌ల్స్‌ నుంచి పొగాకు ధరల వరకు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు ఇవే
విద్యార్థులకు అలర్ట్..తెలంగాణ ఈఏపీ సెట్..పీజీ ఈసీఈటీ పరీక్షల షెడ్యూల్ విడుదల