Warangal: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురికి కడుపు చేసిన బాబాయ్

  • By: sr    news    Mar 22, 2025 4:08 PM IST
Warangal: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
  • అబార్షన్ తో వెలుగులోకి వచ్చిన సంఘటన
  • మానుకోట జిల్లాలో జరిగిన దుర్మార్గం

విధాత, వరంగల్: వావివరుసలు మరిచిన కామాంధుడు వదిన వరుసైన మహిళను వలలో వేసుకుని, కూతురు వరుసైన బాలికకు కడుపు చేసిన దుర్మార్గం వెలుగుచూసింది. తన సుఖం కోసం సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసిన తల్లి నిర్వాకం..కూతురు వరుసైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాబాయ్ దుర్మార్గం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణతో బయటపడింది.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్ కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురిపై కూడా కన్నేశాడు. తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం తన అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు. బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్ కు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సీడీపీవో విజయలక్ష్మి పర్యవేక్షణలో బాధిత బాలికకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

బాలికకు అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపైన, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులను నమోదు చేశారు. తొర్రూర్ సీఐ గణేష్ బాధిత బాలిక స్టేట్మెంట్ రికార్డు చేశారు.