హైలైట్స్:

  • అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం
  • అలిపిరి టోల్ గేట్,ఘాట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు
  • ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్,TTD భద్రతా సిబ్బంది సోదాలు
  • తిరుమలలో మాక్ డ్రిల్‌ నిర్వహించిన ఆక్టోపస్‌ బలగాలు

విధాత: జమ్మూకశ్మర్ లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరుగవచ్చన్న కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో అలర్ట్ ప్రకటించారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌ రోడ్లలో తనిఖీలు చేపట్టారు. భద్రతా సిబ్బంది ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది మోహరించారు. తిరుమలలో విజిలెన్స్‌, ఆక్టోపస్‌, పోలీసు బలగాల మాక్ డ్రిల్‌ నిర్వహించారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో తిరుమల ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండవచ్చని గతంలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.