MP Konda Vishweshwar Reddy | ట్యాపింగ్ చేసి ఎలక్ట్రోరల్ బాండ్లు రాయించుకున్నారు : ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ చేసి పాలన చేశారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. ఈ కేసులో సరైన న్యాయం జరగాలంటే కేసీఆర్.. కేటీఆర్ పై వెంటనే చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

MP Konda Vishweshwar Reddy | ప్రజావ్యతిరేకతను అధిగమించేందుకు..మరోసారి అధికారంలోకి రావాలన్నకుట్రలతో కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ అభ్యర్థన మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా తన వాంగ్మూలం ఇచ్చానని.. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు చూపించారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాప్ పక్కాగా జరిగిందన్నారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో ట్యాప్ అయిందని..చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ చేసి పాలన చేశారని విమర్శించారు. ఈ కేసులో సరైన న్యాయం జరగాలంటే కేసీఆర్.. కేటీఆర్ పై వెంటనే చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఈ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయిన వారందర్నీ శిక్షించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంట్లో లేవనేత్తుతామని తెలిపారు. ట్యాపింగ్ కేసు విచారణకు అవసరమైతే కేంద్రం సహకారం తీసుకోవాలని సూచించారు. ట్యాపింగ్ చేసి ఎలక్ట్రోరల్ బాండ్లు రాయించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ళకు వ్యతిరేకత వచ్చిందని..దీంతో అధికారంపై అభద్రత భావంతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తన ఆఫీస్ లోకి కొందరు అధికారులు వారెంట్ లేకుండా వచ్చి దౌర్జన్యం చేసి..ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు.
ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల మూవ్మెంట్ పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్ల డబ్బులు పట్టుకుని అవి తన డబ్బులు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఎన్నికల్లో ఈటల రాజేందర్కు డబ్బులు ఇచ్చినట్టు నిందలు మోపారని, తాను ఈటలకు ఎన్నికల సమయంలో సపోర్ట్ చేశాను కానీ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తన మొబైల్ రికార్డింగ్ ట్యాప్ కాదు.. లైవ్ ట్యాప్ అయిందని ఆరోపించారు. తనతో పాటు తన భార్య సంగీత ఫోన్ సైతం ట్యాప్ చేశారన్నారు. మునుగోడు ఎలక్షన్ టైంలో ఇంఛార్జ్లు గా ఉన్నపుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు కొండా. ఫోన్ ట్యాప్ కు హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి కానీ ఇక్కడ అవేమి లేకుండా ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. కాల్ డీటెయిల్స్ రికార్డు జరిగిందని అప్పట్లో తాను ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు కొండా.