చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు 7 లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల బస్సు ప్రమాదం పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా.. క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు.

  • By: Subbu |    news |    Published on : Nov 03, 2025 6:18 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు 7 లక్షల ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్, నవంబర్ 03(విధాత): చేవెళ్ల బస్సు ప్రమాదం పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా.. క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. సోమవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చిన ప్రజల సహకారం అవసరం అని ఈ సందర్భంగా మంత్రి పొన్నం కోరారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఆర్ అండ్ బీ నుండి బ్లాక్ స్పాట్స్ గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ సీరియస్ గా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే, ఘటనకు పై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

‘రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి… ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈరోజు జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డులో డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతున్నాయి చూడాలి. దానిని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలి. రవాణా శాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ సీరియస్ గా యాక్టివ్ గా ఉండాలి. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలి. రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలి’ అని మంత్రి పొన్నం ఆదేశించారు.

అందరూ ఎఫెక్టివ్ గా పని చేయాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను పొన్నం హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చన్నారు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. రవాణా శాఖలో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఆజ్ఞాపించారు. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పలిన్ కప్పుకొని తీసుకువెళ్లాలని సూచించారు. డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు.. ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలి అని మంత్రి పొన్నం ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపునకు ఉపయోగించే వాహనాలపై వేధింపులకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు. కమర్షియల్ వాహనాలు , ప్రయాణికులను తరలించే వాహనాలు, మైన్స్ మినరల్స్ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించని వాటికి భారీ పెనాల్టీ తో పాటు కఠినచర్యలు తీసుకోవాలరి ఆదేశించారు. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు అందులో కార్గో సరుకులు తరలించిన కఠినంగా వ్యవహరించాలన్నారు. స్కూల్, హైర్ బస్సుల ఫిట్నెస్, ట్రక్కులు, టిప్పర్లు, లారీలు వాటి ఫిట్నెస్ ఫర్మిట్ లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి పోన్నం ఆదేశించారు. వచ్చే ‘రోడ్ సేఫ్టీ మంత్’ కార్యక్రమంతో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని దాని కన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలి. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.