Warangal: సస్పెండ్ చేయించాడనే ఆక్రోశంతో.. యువకుడి హత్యచేయించిన కానిస్టేబుల్

- సహకరించిన ఐదుగురు నిందితుల అరెస్టు
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
విధాత వరంగల్ ప్రతినిధి: తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి తన సస్పెండ్కు కారణమైన సాయి ప్రకాశ్ అనే యువకుడుని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్తో సహ ఐదుగురిని హన్మకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి నుండి ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్ పిస్తోల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు నిందితులు వీరే
1.ప్రస్తుతం ములుగు వెంటాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, చింతగట్టు, హన్మకొండ జిల్లా,2. డేవిలీ సాయి, గుంటూరు జిల్లా, ఆ.ప్ర, 3. ఆలోత్ అరుణ్కుమార్ ఆలియాస్ పండు, హన్మకొండ, 4.సబావత్ అఖిల్ నాయక్, హన్మకొండ, 5. రాజు, హన్మకొండ, 6.చింతం నిర్మల, వెంటాపురం (వాజేడు), ములుగు జిల్లాకు చేందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 15వ తారీకున రాత్రి 11 గంటల నుండి ములుగు జిల్లా, వెంటాపురం(వాజేడు) ప్రాంతానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ (మృతుడు) హన్మకొండలో అదృశ్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదు పై చేసిన దర్యాప్తులో వివరాలు వెల్లడయ్యాయి.

పాత కక్షతో పథకం ప్రకారం హత్య
మృతుడితో మనస్పర్థలు వున్న ములుగు వెంకటాపురం కానిస్టేబుల్ శ్రీనివాస్పై అనుమానంతో నిందితుల్లో ఒకడైన డేవిలీ సాయిని విచారించారు.
నిందితుడు శ్రీనివాస్ వాజేడ్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించే సమయంలో మరో నిందితురాలు నిర్మలతో వివాహేతర సంబంధం కొనసాగించారు. నిందితురాలికి వరుసకు కొడుకైన మృతుడు సాయి ప్రకాశ్, భర్త, బంధువులు కానిస్టేబుల్ శ్రీనివాస్ వ్యవహరంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసారు. కొద్ది కాలం అనంతరం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తిరిగి విధుల్లో చేరాడు. తన సస్పెండుకు కారణమైన మృతుడి సాయి ప్రకాశ్పై కక్ష్య పెంచుకున్నాడు.
అదునుచూసి పథకం అమలు
ఈ నెల 15వ తేదిన నిందితురాలు నిర్మల తన మామాగారికి ఆరోగ్య పరీక్షలకై కొసం తన భర్తతో పాటు, సాయి ప్రకాశ్తో కలిసి హన్మకొండకు కారులో వచ్చినట్లుగా శ్రీనివాస్కు ఫోన్ సమాచారం ఇవ్వడంతో, శ్రీనివాస్ మిగితా నిందితులతో కల్సి అదే రోజు రాత్రి సాయి ప్రకాశ్ ఒంటరీగా ప్రయానిస్తున్న కారును ఆటో వెంబడిస్తూ గోపాల్పూర్ క్రాస్ రొడ్ బేబి సైనిక్ స్కూల్ వద్ద కారు అడ్డగించి సాయి ప్రకాశ్ను తీవ్రంగా కొట్టుకుంటూ హసన్పర్తి శివారు ప్రాంతంలో కారు అపి శాలువతో గొంతు బిగించి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతదేహాన్ని పడవేసి వేలేరు మీదుగా హన్మకొండ ఏషియన్ మాల్ ప్రాంతంలో కార్ను పార్క్ చేశారు. మరుసటి రోజు సాయి ప్రకాశ్ మృతదేహాన్ని గుర్తించి జిల్లెడు గడ్డ తండా గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో హుస్నాబాద్ పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కబరిచిన హన్మకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఇన్స్స్పెక్టర్ సతీష్తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ ప్రెస్ మీట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ మనన్ భట్ పాల్గొన్నారు.