• Telugu News
  • /News

AP | ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులుకు మే 7 వరకు రిమాండ్

Reported by: sr | వార్త‌లు | Apr 23, 2025, 7:08 pm IST
Read Time: 3 mins
AP | ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులుకు మే 7 వరకు రిమాండ్

విధాత: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు రిమాండ్‌ విధించింది. ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో మంగళవారం ఆయనను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మూడో ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆయనను హాజరుపరిచారు. ఈ క్రమంలో మే 7 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో పీఎస్‌ఆర్​ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.

ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి, వేధించిన కేసులో రెండో నిందితుడు (ఏ2)గా ఆంజనేయులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డీజీ క్యాడర్‌ కలిగిన ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అరెస్టు..రిమాండ్ కావడం ఇదే మొదటిసారి. కాదంబరీ జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసి విచారించగా.. వెల్లడైన అంశాల ఆధారంగా ఆంజనేయులును ఏ2గా చేర్చారు.

దాదాపు 7 నెలల తర్వాత పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. అదిగాక వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్​ విధేయుడిగా పీఎస్ ఆంజనేయులు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీలోని పలువురు ముఖ్య నాయకులపైన, ఇతరులపైన అక్రమ కేసుల బనాయింపులో కీలక వ్యవహరించారు. ఫలితంగా ఇప్పుడు ఆయనపై కేసుల ఉచ్చు బిగిసుకుంది.