Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు బెయిల్ తీర్పు రిజర్వ్!

Prabhakar Rao bail judgment reserved
విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బుధవారం ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసిపోగా తీర్పు రిజర్వ్ చేసింది. ముందస్తు బేయిల్ ఇస్తే ప్రభాకర్ రావు ఆమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరవుతారన్న లాయర్ సి.నిరంజన్ రెడ్డి వాదించారు.
ఆయన పోలీస్ శాఖలో 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పని చేశారని, ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతున్నారని వివరించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్రావు ముందస్తు బెయిల్ పొందారని, అందువల్ల ప్రభాకర్రావుకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారని వాదించారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది నిజం కాదని వాదించారు.
పోలీసుల తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వరాదని, కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయని, హార్డ్డిస్క్లను ధ్వంసం చేసి నీళ్లలో పడేసినట్లు దర్యాప్తులో తేలిందని న్యాయస్థానానికి వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.