Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు! కానీ

విధాత : నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali )కి కోర్టులో ఊరట దక్కింది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోసాని కస్టడీ పిటిషన్ ను సైతం డిస్మిస్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, గత సోమవారం పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేసినా.. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా.. పోసాని మళ్లీ పై కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం పోసోని జైలులోనే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.
కాగా పోసానికి మరో కేసులో నరసరావుపేట కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు పోసాని కృష్ణ మురళిని రేపు, ఎల్లుండి విచారించనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దూషించిన కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న పోసానికి రెండు రోజుల కస్టడీ విధించడం విశేషం.