విధాత: ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావును ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఐడీబీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ ఆయన ఫొటోతో సహా రుణ వివరాలతో బహిరంగ ప్రకటన చేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ మాజీ ఎంపీ,గీతం విద్యా సంస్థల స్థాపకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి కుమారుడైన ఎంఎస్పీ రామారావు కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ కంపెనీ రూ. 1,019 కోట్లు బకాయి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా తీసింది. దీన్ని లిక్విడేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ఏడాది జూన్ 21వ తేదీ నాటికి బ్యాంకుకు కంపెనీ రూ. 1019,38,61,603 బకాయి ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. రుణాలు చెల్లించకపోవడంతో తనఖా కింద పెట్టిన భూముల వివరాలను ప్రకటిస్తూ.. సదరు భూములపై ఎవరూ క్రయవిక్రయాలు చేయరాదని బ్యాంక్ హెచ్చరించింది.
భూముల వివరాలు:
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని 121 ఎకరాలను కంపెనీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు బ్యాంక్ తెలిపింది. అలాగే ఆ భూముల్లో ఉన్న యంత్ర సామగ్రి, స్థిర, చర ఆస్తులు కూడా తమ ఆధీనంలో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే ఇదే జిల్లా ఉప్పలగుప్తం మండలం సురసాని యానాం గ్రామంలో 54 ఎకరాలు, కొత్తపేట గ్రామంలోని 3 ఎకరాలు తమ ఆధీనంలో ఉన్నాయని బ్యాంక్ పేర్కొంది.