ముంబై: మహీంద్రా గ్రూప్నకు చెందిన ఫార్మ్ ఎక్విప్మెంట్ బిజినెస్ (FES) మే 2025 నెలకు సంబంధించిన తమ ట్రాక్టర్ల విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, 2025 మే నెలలో దేశీయ మార్కెట్లో 38,914 యూనిట్లను విక్రయించారు. ఇది గత ఏడాది (మే 2024లో) అమ్ముడైన 35,237 యూనిట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధిని చూపుతోంది.
ఈ ఏడాది మే నెలలో దేశీయ, ఎగుమతి విక్రయాలు కలిపి మొత్తం 40,643 ట్రాక్టర్ యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 37,109 యూనిట్లు అమ్ముడయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం, 1,729 ట్రాక్టర్ యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి.
వృద్ధికి కారణాలు:
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో భాగమైన ఫార్మ్ ఎక్విప్మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ, ఈ విక్రయాల వృద్ధికి దోహదపడిన అంశాలను వివరించారు. “గతేడాదితో పోలిస్తే 2025 మే నెలలో దేశీ మార్కెట్లో ట్రాక్టర్ల అమ్మకాలు 10 శాతం పెరిగి 38,914 యూనిట్లుగా నమోదయ్యాయి” అని ఆయన తెలిపారు. సాధారణం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావడంతో ఖరీఫ్ పంటలు వేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా వరి నాట్ల కోసం నేల సిద్ధం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదనంగా, వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరను పెంచడం రైతన్నలలో సానుకూల సెంటిమెంట్ను పెంచిందని నక్రా అన్నారు. జలాశయాలలో మెరుగైన నీటి నిల్వలు, రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలు రాబోయే కాలంలో రైతులు అధిక ఉత్పత్తిని సాధించేందుకు తోడ్పడతాయి. ఈ కారకాలన్నీ ట్రాక్టర్లకు డిమాండ్ను పెంచడానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగుమతి మార్కెట్లలో 1,729 ట్రాక్టర్లను విక్రయించినట్లు కూడా ఆయన వెల్లడించారు