Site icon vidhaatha

Bhu Barathi: ‘భూ భార‌తి’కి.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌ధ్యంలో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగిందన్నారు. రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌లకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపేలా భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామన్నారు. ఈ చ‌ట్టంలో పాలుపంచుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమ‌మే ధ్యేయంగా భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగిందన్నారు. ఈ చ‌ట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందించ‌డంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌కు సూచించారు.

గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం నాడు స‌చివాల‌యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు, రైతులు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోన్నారని తెలిపారు. భూ స‌మ‌స్య‌లేని గ్రామం తెలంగాణ‌లో లేదన్నారు. గ‌త ప్ర‌భుత్వం త‌మ వ్య‌క్తిగ‌త స్వార్ధం కోసం ప్ర‌యోజ‌నాల కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల‌లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌డానికి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని ఇందుకు సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కివ‌చ్చిందన్నారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని మంత్రి అన్నారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌నిచేయాలని ఉద్యోగులను ఆయన కోరారు. రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ అని తెలిపారు. ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లు కేంద్ర‌బిందువుగా మా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు ఉంటాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్ర‌జ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేయాలని కోరారు.

ప్రజాస్వామ్య యుతంగా రూపొందిన చట్టం

తెలంగాణ గవర్నర్ భూ భారతి చట్టాన్ని ఆమోదించారు. తెలంగాణ ప్రజల భూమి హక్కుల రికార్డుల సమస్యల పరిస్కారం లో ఇదో కీలక మజిలీ. ఈ ప్రయాణంలో భాగస్వామ్యున్ని అయినందుకు సంతోషం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ చట్టం రూపొందింది. ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో చట్టం అమలు జరగాలని, రైతుల భూమి సమస్యలు తీరాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రికి, గౌరవ రెవిన్యూ మంత్రికి, ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ అధికారులకు కృతజ్ఞతలు. –  భూమి సునీల్, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు

Exit mobile version