Vemulawada |
- కార్యకర్తలకు నాడు వివక్ష.. నేడు విలువ అంటూ వ్యాఖ్యలు
- ఉద్యమకారులంతా ఏకమై.. చల్మెడ గెలుపునకు కృషి చేస్తామని హామీ
విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనరసింహారావును ప్రకటించిన నేపథ్యంలో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. ఎవరికి తోచిన రీతిలో వారు సంబరాలు జరుపుకుంటూ, చల్మెడపై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈక్రమంలోనే రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమురయ్య గౌడ్ చల్మెడకు టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మంగళవారం వేములవాడ రాజన్నకు తలనీలాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకొని బతికిన తనకు ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నాయకత్వం లో అడుగడుగునా అన్యాయమే జరిగిందని వాపోయారు.
ఉద్యమ కాలం నుండి నేటి వరకు దాదాపు 500 కార్యక్రమాలకు పైగా నిర్వహించి, రుద్రంగి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైన తనకు.. రమేష్ బాబు హయాంలో సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పటికైనా ఇక్కడి పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్ పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇక నుండి నియోజకవర్గంలోని ఉద్యమకారులందరికి తగిన గౌరవం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అడుగడుగునా అణచివేతకు గురైన ఉద్యమకారులందరూ ఏకమై చల్మెడ లక్ష్మీనరసింహారావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.