సీపీఐ నారాయణ : బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
దేశంలో న్యాయవ్యవస్థ మాత్రమే పోరాడుతోందని, మిగతా అన్ని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నియంత్రించిందని సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు.

దేశంలో న్యాయ వ్యవస్థ మాత్రమే పోరాడుతోంది
మిగతా అన్ని వ్యవస్థలను మోదీ సర్కార్ చరబట్టింది
గవర్నర్లు ప్రభుత్వాలను శాసిస్తున్నారు
హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): భారత దేశ న్యాయవ్యవస్థ ప్రస్తుతం వీరాభిమన్యుడిలా పోరాడుతోందని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతిమంగా ఈ జ్యుడీషియరీ కాపాడుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఒకవైపు రాష్ట్రపతిని మరోవైపు ఎన్నికల కమిషన్ ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. ఈసీని, ఈడిని, సిబిఐని గ్రిప్ లో పెట్టుకొన్నారు. జ్యుడీషియరీ ఒకటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నామినేటెడ్ గవర్నర్లుగా నియమించబడిన వారు ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ బహిరంగంగానే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలోతప్ప మిగిలిన అన్ని చోట్ల పాలక ప్రభుత్వాలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాలని గౌరవించాలని జుడీషియరీ కూడా చెబుతున్నప్పటికీ, అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనటం విచారకరమన్నారు. దేశంలోని ప్రధాన బాడీలలో రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, జ్యుడీషియరీ, నీతి అయోగ్, సిబిఐ ప్రధానమైనవికాగా ఇందులో నాలుగింటిని మోడీ సర్కార్ మింగేసిందని నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో జుడీషియరీ మాత్రమే మిగిలింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కిందిస్థాయిలో చాలా బలంగా మిగిలి ఉందన్నారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చారిత్రక నేపథ్యం ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని, జ్యుడీషియరిని కాపాడుకునేందుకు పోరాడుతామన్నారు. సెంట్రల్ లో కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని అధిగమించాలంటే భారతదేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకత్రాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దీనిపై సీపీఐ చర్చిస్తున్నది. సెప్టెంబర్ 22 నుండి చండీగర్లో జరిగే జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ‘ యాంటీ బీజేపీ ఫ్రంట్’ ఏర్పడే దిశగా కృషి చేస్తామని నారాయణ వెల్లడించారు.