ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , కూటమి నేతలు అమరావతి బ్రహ్మoడమైన రాజధాని అంటున్నారని..అలాంటప్పుడు వారు అమరావతిలో నివాసం ఉండకుండా హైదరాబాద్ లో ఎందుకు నివాసం ఉంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం నల్లగొండలో గుత్తా మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. కూటమి నేతలు ఏపీ – తెలంగాణల మధ్య షటీల్ ట్రిప్ లు ఆపాలని, ముందుగా వారు ప్రపంచ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామన్న మాటలపై అక్కడి ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అమరావతిలోనే ఉంటే బాగుంటుందన్నారు. కూటమి నేతలు తెలంగాణ రాజకీయాల వైపు కాకుండా..ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిదన్నారు. తెలంగాణ కన్నా ఏపీ లో ఎక్కువ సహజ వనరులు ఉన్నాయని, సముద్ర తీరం, రకరకాల పోర్టులు ఉన్నాయి అని, ఏపీ పాలకులు ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణ రాజకీయాలవైపు దృష్టి పెట్టడం సరైంది కాదన్నారు.
పవన్ కళ్యాణ్ సభకు సరైన సమయం కాదు
ఓ వైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే పవన్ కల్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టడం ఎందుకని. పవన్ సభ నిర్ణయానికి సరైన సమయం కాదని..అందుకే పోలీసులు అనుమతించకపోవచ్చని గుత్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ తెలిసిన వారు ఆ రోజు సభ పెట్టరు అన్నారు. పవన్ భాష తీరు సరిగా లేదు అని, పరస్పర దూషణలు సరైంది కాదు అని, తెలంగాణలో విద్వేషాలు పెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. కృష్ణా జలాల్లో ఇప్పటికి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఏపీ నేతల వైఖరి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య శాశ్వత వైషమ్యాలు ఏర్పడుతాయి అని, అవకాశం వచ్చిన ప్రతిసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం కక్కుతోందని గుత్తా ఆరోపించారు.
తెలంగాణ లో 75% ధాన్యం సేకరణ పూర్తి అయింది.ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సహకరించడం లేదు అందువల్లే కొంత ఆలస్యమైందని గుత్తా అన్నారు. పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలి. వరి, పత్తి తప్ప రైతులు ఇతర పంటలు పండించడం లేదు అన్నారు. మార్కెట్, డిమాండ్ కు అనుగుణంగా పంటల మార్పిడి చేయడం రైతులు అవవర్చుకుంటే మార్కెటింగ్ కష్టాలు తప్పుతాయని సూచిచారు.