Rahul Gandhi | రాహుల్ గాంధీ అరెస్టు !
ఓట్ల చోరీ ఆరోపణలపై ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తం, రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి ఎంపీల అరెస్ట్.

‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తం
ఖండించిన టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్
Rahul Gandhi | విధాత : బిహార్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ..గత లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ‘పార్లమెంటు టూ ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తతలకు..అరెస్టులకు దారితీసింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ.. పార్లమెంటు బయట పోలీసులు సంసద్ మార్గ్ లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ రహదారిని మూసివేశారు. విపక్ష్హ ఎంపీలు పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. బారికేడ్లు పెట్టి వారిని పోలీసులు అడ్డుకున్నారు. అఖిలేశ్ యాదవ్ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు యత్నించారు. వాటిపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. పోలీసులు వారిని ముందుకెళ్లకుండా నిలువరించారు. ఆగ్రహించిన విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఎంపీలను బస్సుల్లో తరలించారు. ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
భేటీకి సీఈసీ అపాయింట్ మెంట్
కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తున్న క్రమంలేనే బిహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే సహా, ఓట్ల చోరీ అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈసీకి లేఖ రాశారు. ఇందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.. విపక్షాలతో భేటీకి అంగీకరించింది. 30 మంది విపక్ష ఎంపీలు మాత్రమే సమావేశానికి రావాలని చెబుతూ సోమవారం మధ్యాహ్నానికి అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం.
ఎంపీల అరెస్ట్ అక్రమం… అప్రజాస్వామికం : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఓట్ల చోరీ పై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేయడం అక్రమం..అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీపై వినతి పత్రం ఇస్తామని శాంతి యుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్యగా విమర్శించారు. న్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఓట్ల చోరీ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.