Asia Cup 2025 | ఆసియాకప్​ 2024: సూపర్​ 4లో సూపర్​ ఓవర్​ – లంక​పై భారత్​ విజయం

దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్​ సూపర్​ 4 ఆఖరి మ్యాచ్​లో  సూపర్ ఓవర్​ ద్వారా భారత్ శ్రీలంకపై  విజయం సాధించింది. ఫైనల్​ ఆదివారం భారత, పాకిస్తాన్​ జట్ల మధ్య జరుగనుంది.

Asia Cup 2025 | ఆసియాకప్​ 2024: సూపర్​ 4లో సూపర్​ ఓవర్​ – లంక​పై భారత్​ విజయం

Asia Cup 2025 | ఎటువంటి సంచలనాలు లేకుండా సాగిపోతున్న అసియాకప్​ పోటీలకు నామమాత్రమైన ఆఖరి సూపర్​ 4 మ్యాచ్​ మాత్రం సూపర్​ ఝలక్​ ఇచ్చింది. భారీ స్కోర్ల మ్యాచ్​ సూపర్​ ఓవర్​కు దారితీసింది.  భారత్​ ధాటిగా ఆడి టోర్నమెంట్​లోనే అత్యధిక స్కోరు(202) నమోదు చేసినా, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక పోయేదేముందన్నట్లు ఆడి సంచలనంగా అంతే స్కోరు సాధించి మ్యాచ్​ను సూపర్​ ఓవర్​కు తీసుకెళ్లింది. భారత్​ విధించిన 202 పరుగుల స్కోరును  అదే 5 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో సూపర్​ ఓవర్​కు చేరుకున్నమ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన లంక 6 బంతులకు గాను 5 బంతులకే 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. అందులో ఒకటి వైడ్​ కాగా, ఒకటే అధికారిక పరుగు. అనంతరం భారత్​ మొదటి బంతికే 3 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపు రెండు జట్లకు ఎటువంటి లాభం చేకూర్చకపోయినా, ప్రాక్టీస్​ మాత్రం బ్రహ్మాండంగా అయింది.

టాస్​ గెలిచి ఇండియాను బ్యాటింగ్​కు దించిన లంకేయులు, భారత బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. మళ్లీ శివాలెత్తిన అభిషేక్​ శర్మ వరుసగా మూడో అర్థశతకం సాధించగా, మిగిలినవారందరూ తలో చేయి వేయడంతో భారత్​ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్​ 61(31 బంతులు, 2 సిక్స్​లు, 8 ఫోర్లు), తిలక్​49 నాటౌట్​(34 బంతులు, 1 సిక్స్​, 4 ఫోర్లు), సంజూ39 (23 బంతులు, 3 సిక్స్​లు, 1 ఫోర్​) పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్​21(15 బంతులు, 1 సిక్స్​, 1 ఫోర్​) చేసి భారీ స్కోరుకు బాటలు వేసారు.  బోర్డు మీద 200 దాటిన స్కోరు చూసి భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

అనంతరం, లక్ష్యసాధనకు దిగిన లంకేయులు ఊహించని విధంగా ఇండియాకు షాక్​ల మీద షాక్​లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓపెనర్ నిశాంక 107(58 బంతులు, 6 సిక్స్​లు, 7 ఫోర్లు), వన్​ డౌన్​ కుశాల్​ పెరీరా 58(32 బంతులు, 1 సిక్స్​, 8 ఫోర్లు) పరుగులతో వీర విధ్వంసం సృష్టించారు. మరో ఓపెనర్​ కుశాల్​ మెండిస్​ 7 పరుగలప్పుడు డకౌట్​ కావడంతో భారత అభిమానులు ఇక మొదలైంది అనుకుంటూ ఎంజాయ్​ చేసారు కానీ, ఆ తర్వాతే అసలు వినాశనం మొదలైంది. రెండో వికెట్​కు ఏకంగా 127 పరుగులు జోడించిన ఈ జంట, ఎడాపెడా ఫోర్లు, సిక్స్​లు బాదుతూ, ఏ బౌలర్​నూ వదిలిపెట్టలేదు. మొత్తం భారత జట్టు, ప్రేక్షక జనం చేష్టలుడిగి  చూస్తుండిపోయింది. మెల్లగా వికెట్ల పతనం మొదలైనా ఓపెనర్ నిశాంక మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగి ఈ కప్​లో మొదటి సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. చివరికి 107 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిశాంక విధ్వంసం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 20 ఓవర్లకు సరిగ్గా 202 పరుగులు చేసింది.

ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్​, పాకిస్తాన్​ల మధ్య ఫైనల్​ పోరు జరుగనుంది.