Romario Shepherd | ముంబై బ్యాటర్‌ షెఫర్డ్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6 పరుగులు..!

  • Publish Date - April 7, 2024 / 08:10 AM IST

Romario Shepherd : ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల ఖాతా తెరవలేకపోయిన ముంబై ఇండియన్స్ టీమ్‌.. ఇవాళ తమ సొంత మైదానంలో రెచ్చిపోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్‌లు పూనకం వచ్చినట్టే బ్యాటింగ్‌ చేశారు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లు కొడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. పట్టపగలే ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో ముంబై టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుకు ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయామనే కసేనో ఏమోగానీ.. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఆ జట్టు ప్లేయర్లు దూకుడుగా ఆడారు. మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49 పరుగులు) ఆరంభంలోనే దూకుడుగా ఆడి జట్టుకు గట్టి పునాది వేశాడు. ఇషాన్‌ కిషన్‌ సైతం 23 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ధాటికి ముంబై 6.5 ఓవర్లలో 80/0తో నిలిచింది. ఆ తర్వాత బంతికి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఇక ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌ రూపంలో డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ మిగతా ప్లేయర్లు రెచ్చిపోయారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన కెప్టెన్‌ హార్దిక్ పాండ్య 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అప్పటివరకు వేగంగా మాత్రమే వెళ్లిన ముంబై స్కోర్‌.. టిమ్‌ డేవిడ్‌, రొమారియా షెఫర్డ్‌ల ధాటికి జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. టిమ్‌ డేవిడ్‌ 21 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్‌లో మరో 13 బంతులు ఉండగా క్రీజులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. అన్రిచ్‌ నోకియా వేసిన చివరి ఓవర్‌లో షెఫర్డ్ పెను తుపాను సృష్టించాడు. తొలి బంతిని ఫోర్‌ కొట్టిన ఈ విండీస్‌ ప్లేయర్‌.. ఆ తర్వాత హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి ఫోర్‌ కొట్టి, చివరి బంతికి మళ్లీ సిక్స్‌ బాదాడు. దాంతో ఒకే ఓవర్‌లో మొత్తంగా 32 పరుగులు (4, 6, 6, 6, 4, 6) వచ్చాయి.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్‌ ఇదే కావడం గమనార్హం. రొమారియో షెఫర్డ్‌ విధ్వంసానికి ముంబై ఇండియన్స్‌ టీమ్‌ అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరే చేసింది. చివరి 13 బంతుల్లోనే 53 ర‌న్స్ జోడించింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 234 ర‌న్స్ చేసింది. అయితే ముంబై బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ చేయకపోవడం గమనార్హం. ఢిల్లీ బౌల‌ర్లలో అక్షర్ ప‌టేల్, అన్రిచ్ నోకినా రెండేసి వికెట్ల చొప్పున తీయగా, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Latest News