ఉద్వేగపు క్షణం.. ఆఖరి ఓవర్ అయిదో బాల్కు రబాడను కళ్లుచెదిరే క్యాచ్తో సూర్యకుమార్ పెవిలియన్కు పంపిన క్షణం. ప్రపంచకప్ ఖరారు చేసిన ఆ బంతిని వేసిన హార్థిక్ కళ్లవెంట ధారాపాతంగా కన్నీళ్లు. కారుతున్న కన్నీళ్లతోనే ఆరో బాల్ సంధించిన క్షణం. మరుక్షణం హోరెత్తిన జనం. అక్కడే కన్నీళ్లతో కూలబడ్డ పాండ్యా. ఆనందబాష్పాలతో నేలను తడుతూ, ముద్దాడిన కెప్టెన్ రోహిత్. కోహ్లీకి ఆగని ఆనందబాష్పాలు. జట్టు సభ్యుల ఆనంద బాష్పాల నడుమ ఆకాశం కూడా ఆనందంతో వర్షించింది. కోహ్లీ ఇదే తన ఆఖరి ప్రపంచకప్ అని ఉద్వేగంతో ప్రకటించిన వేళ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సగర్వంగా కప్పునెత్తుకున్నాడు.
భారత్ చేసి చూపించింది. స్వేదేశంలోనే పులులన్న మాటను తుడిచిపెడుతూ ఓటమన్నదే లేకుండా 2024 టి20 ప్రపంచకప్ను ముద్దాడింది(India win). ముందుగా బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేసిన భారత్, తర్వాత దక్షిణాఫ్రికాను 169 పరుగుల వద్దే కట్టడి చేసి సగర్వంగా కప్ను గెల్చుకుంది. యావద్భారతదేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ(76 పరుగులు), మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా జస్ప్రీత్ బుమ్రా(15 వికెట్లు) ఎంపికయ్యారు.
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈసారి సీన్ రివర్సయింది. ముందుగా రోహిత్ శర్మ(9) పరుగులకు అవుటవగా, వన్డౌన్లో వచ్చిన పంత్(0) కూడా అదే స్కోరు వద్ద అవుటయ్యాడు. 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్(3) కూడా అవుటవడంతో భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి గొంతువరకు మునిగిపోయింది. ఈ దశలో నిబ్బరంగా ఆడుతున్న కోహ్లీకి అక్షర్ పటేల్ జత కలిసాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరును పరుగులెత్తించారు. ముఖ్యంగా కోహ్లీ యేధేచ్చగా షాట్లు కొడుతూ, రన్రేట్ తగ్గకుండా చూసాడు. మరోవైపు అక్షర్ కూడా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ ప్రొటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇద్దరూ 4 వికెట్కు విలువైన 72 పరుగులు జోడించిన తర్వాత అక్షర్(31 బంతుల్లో 47 పరుగులు: ఒక ఫోర్, 4 సిక్స్లు) అవుటయ్యాడు.
ఆ తర్వాత కూడా కోహ్లీ దూకుడు కొనసాగించాడు. దూబేతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. విరిద్దరూ కూడా మరో అర్థసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, మంచి ఫైటింగ్ స్కోరు అయ్యేలా దోహదపడ్డారు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ ఫామ్ను అందుకుని భారత్ను ఆదుకున్నాడు. చివరికి స్కోరు పెంచే క్రమంలో కోహ్లీ (59 బంతుల్లో 76 పరుగులు: 6 ఫోర్లు, 2 సిక్స్లు)అవుటయ్యాడు. దూబే 27 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, తుదకు నిర్జీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. India 176/7.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ , నోకియా చెరో 2 వికెట్లు తీసుకోగా, జాన్సన్, రబాడ తలా ఒకటి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు హెండ్రింక్స్, డికాక్లు మొదటి ఓవర్ కాపాడుకోగా, రెండో ఓవర్ వేసిన బుమ్రా, హెండ్రింక్స్(4)ను బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. వెంటనే రెండో వికెట్గా కెప్టెన్ మార్క్రమ్(4) అర్షదీప్కు బలయ్యాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ను ట్రబ్స్, ఓపెనర్ డికాక్ ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరును పెంచారు. 58 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్టబ్స్(31)ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేసి ఈ జంటను విడదీసాడు. మరో 36 పరుగుల తర్వాత క్వింటన్ డికాక్ (39)అర్షదీప్ బౌలింగ్లో కుల్దీప్కు చిక్కి డగౌట్కు చేరాడు. 5వ బ్యాటర్గా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (Henrich Klaasen) సిక్స్లు బాదుతూ కావాల్సిన రన్రేట్ను తగ్గించే ప్రయత్నం చేసాడు. అతనికి జత కలిసిన డేవిడ్ మిల్లర్ కూడా ఇతోధికంగా సాయపడ్డాడు. కానీ, క్లాసెన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దాదాపు తన జట్టును గెలిపించినంత పనిచేసాడు. అతనున్నంతసేపు భారత శిబిరంలో ఆశలన్నీ ఆవిరయ్యాయి. క్లాసెన్(27 బంతుల్లో 52 పరుగులు: 3 ఫోర్లు, 5 సిక్స్లు)ను పాండ్యా అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చినా, అప్పటికీ మ్యాచ్ ప్రొటీస్ వైపే మొగ్గిఉంది.
మరో 26 పరుగులు కావాల్సిన తరుణమది. ఉన్న బంతులు 23. క్రీజ్లో మార్కో జాన్సన్, మిల్లర్. చాలు కదా అనుకున్నారు ఆఫ్రికన్లు. కానీ, అక్కన్నుంచే అద్భుతం ప్రారంభమైంది. తమలో ఒత్తిడి పెరిగిందని వారికి అర్ధమైంది. 18వ ఓవర్ వేసిన బుమ్రా మ్యాజిక్, జాన్సన్(2)కు ఇంటికి పంపింది. ఇక లక్ష్యం పెద్దదవుతూ, ఒత్తిడి ఇంకా పెరుగుతూ వచ్చింది. ఉన్నది ఒక్క మిల్లర్ మాత్రమే. కెప్టెన్ రోహిత్ ఆఖరి ఓవర్ను హార్థిక్ పాండ్యాకు అప్పగించాడు. మొట్టమొదటి బంతికే సిక్స్ కొడదామనుకున్న మిల్లర్(21)ను బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ అవుట్ చేసాడు. దాంతో విజయం దాదాపు ఖరారైపోయింది. రెండో బాల్ను రబాడ ఫోర్ బాదగా, రెండవ, మూడవ బంతులకు సింగిల్స్ బై రూపంలో వచ్చాయి. సమీకరణం రెండు బంతులు పది పరుగులుగా మారింది. అయిదవ బంతి వైడ్, ఇంకా 9 పరుగులు, 2 బంతులు. అదనపు బంతికి రబాడ(4) అవుట్. అంతే… మిగిలిన ఒక బంతికి 9 పరుగులు కావాలి. దాంతో విజయం ఖరారు కాగా, ఆనందబాష్పాలు ధారాపాతంగా కారుతుండగా, పాండ్యా చివరి బంతిని వదిలాడు. ఒక్క పరుగుతో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. కప్ భారత్ వశమయింది. దేశమంతా సంబరాలు మొదలయ్యాయి.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్టును అభినందిస్తూ ఎక్స్లో విడియో సందేశం పోస్ట్ చేసారు. దేశ ప్రజలందరి తరపునా జట్టుకు అభినందనలు తెలియజేసారు.
CHAMPIONS!
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
— Narendra Modi (@narendramodi) June 29, 2024