రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ పై వెస్టిండీస్ తొలి టెస్టులో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో విండీస్ జట్టు 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. విండీస్ నిర్దేశించిన 211పరుగుల లక్ష్య చేధనలో పాకిస్తాన్ బ్యాటర్లు కరేబియన్ పేసర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దీంతో ఈ టెస్టు మ్యాచ్ లో పడిన మొత్తం 40వికెట్లలో ఇరుజట్ల పేస్ బౌలర్ల పడగొట్టారు. టెస్టు చరిత్రలో ఇలా ఒక మ్యాచ్లో అన్ని వికెట్లను పేసర్లే పడగొట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం. పాక్పై విండీస్ పేసర్లు తొలిసారి 20 వికెట్లను తీసి కొత్త రికార్డు నమోదు చేశారు.
రెండు ఇన్నింగ్స్ల్లో ఏడు వికెట్లు తీసిన జస్టిన్ గ్రీవ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పాక్ తొలి ఇన్నింగ్స్ లో గ్రీవ్స్ వరుసగా ఐదు వికెట్ మెయిడిన్ ఓవర్లు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో గ్రీవ్స్కు ఇదే తొలి ఫైఫర్ కావడం విశేషం. రెండో మ్యాచ్ పోర్ట్ ఆప్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది.
వృథాయైన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒంటరి పోరాటం
ఓవర్నైట్ 57/6 స్కోరుతో కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ను కెప్టెన్ బాబర్ అజామ్ (58*) అజేయ హాఫ్ సెంచరీ సహాయంతో ఆదుకునేందుకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే బాబర్ కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. చివరి బ్యాటర్ మహమ్మద్ అబ్బాస్ (23)తో కలిసి పోరాడిన బాబార్ చివరకు నాటౌట్గా మిగిలాడు. దీంతో పాక్ రెండో ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌటైంది. విండీస్ పేసర్ జైదెన్ సీలెస్ ఐదు వికెట్ల (5/20) ప్రదర్శనతో పాక్ను బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్లో విండీస్ 311 పరుగులు చేయగా.. పాక్ 282 రన్స్కే పరిమితమైంది. అనంతరం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి పాక్ ఎదుట 211 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. పాక్ బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు 120 పరుగులకే కుప్పకూలి 90 పరుగులతో ఓటమిపాలైంది.
గత 11 టెస్టుల్లో విండీస్కిది రెండో విజయం. చివరిసారిగా శ్రీలంకపై విండీస్ కు గెలుపు దక్కింది. ఆ తర్వాత ఏడు మ్యాచుల్లో ఓడి.. రెండు టెస్టులను డ్రా చేసుకుంది. పాక్ సాధించిన టెస్టు మ్యాచ్ విజయాన్ని ఇటీవలే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీఫీల్డ్ సోబెర్స్ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం ఇస్తున్నట్లు విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ వెల్లడించాడు. మరోవైపు పాకిస్థాన్ విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టుల్లో ఓటమిపాలై దారుణ రికార్డు మూటగట్టుకుంది. చివరిసారిగా పాక్ కూడా 2023లో శ్రీలంకపై గెలిచింది.
