Mission Bhagiratha । మిషన్ భగీరథ ప్రాజెక్టులో 20 వేల కోట్ల రూపాయల అవినీతి : మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గత బీఆరెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 46 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో 15 వేల నుండి 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Mission Bhagiratha । మిషన్ భగీరథ ప్రాజెక్టులో 20 వేల కోట్ల రూపాయల అవినీతి : మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణ
  • 53 శాతం ఇండ్లకు మంచినీరు ఇవ్వని బీఆరెస్ ప్రభుత్వం
  • వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం
  • రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Mission Bhagiratha । గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, 46 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో 15 వేల నుండి 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదన్న భయంకరమైన విషయం వెలుగు చూసిందని వెల్లడించారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రాంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజలకోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు.

వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.72 వేల కోట్లు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. 27 రోజుల్లో 23 లక్షల మందికి రూ. 18 వేల కోట్ల రైతు రుణాలను రద్దు చేశామని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని, అన్న మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు అర్హులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు వేరు వేరుగా అందించబోతున్నామని పొంగులేటి ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలను కాజేసిన గత ప్రభుత్వ పెద్దలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ప్రతి దానిని రాద్ధాంతం చేయడం అలవాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. వారి పాలనలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే భ్రమలో బీఆర్ఎస్ నాయకులు జీవిస్తున్నారని ఎద్దేవా విమర్శించారు.