Road Accident | జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరిగిపోగా, మరికొందరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అతి వేగం లేదా డ్రైవర్ నిద్ర మబ్బులో ఉండి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నంబర్ ఏపీ 39 జడ్ 0557.
