తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్
విధాత : తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్తు కొనుగోలు జరిగిందని పునరుద్ఘటించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు.
తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. దీంతోపాటు ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖను ఈ నెల 15వ తేదీన కమిషన్కు పంపించారు.
తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని కేసీఆర్ ఆ లేఖలో స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత లేదని తేల్చిచెప్పారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైదొలగాలని (రెక్యూజ్ కావాలని) జస్టిస్ నర్సింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.
మిషన్ టర్మ్స్ అంఢ్ రిఫరెన్సెస్లో ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు, జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ ఆ లేఖలో బదులిచ్చారు. ‘న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా, విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించడం విచారకరమని కెసిఆర్ ఆక్షేపించారు. . చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే మీడియా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.. చివరికి న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీల అధికార పరిధి గురించి చట్టంలో ఏముందో కూడా గమనించకుండా మీరు మాట్లాడారు’ అని కేసీఆర్ తన లేఖలో ఆరోపించారు