Navy Radar Project । వీఎల్‌ఎఫ్‌ ప్రాజెక్టుపై నిర్ణయాలన్నీ గత ప్రభుత్వానివే : సీఎం రేవంత్‌రెడ్డి

ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరారు. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని విన్నవించారు.

Navy Radar Project । వీఎల్‌ఎఫ్‌ ప్రాజెక్టుపై నిర్ణయాలన్నీ గత ప్రభుత్వానివే : సీఎం రేవంత్‌రెడ్డి

Navy Radar Project  । దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందిందని చెప్పారు. వీఎల్‌ఎఫ్‌ను వివాదం చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వికారాబాద్‌ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో నూతనంగా ఏర్పాటు చేసే నేవీ రాడార్​ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారని, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని గుర్తు చేశారు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు.

వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ అడగిన వెంటనే తాము కొనసాగించామని తెలిపారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా.. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు’ అన్నారు. ‘ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు… దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి’ అని చెప్పారు. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరారు. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని విన్నవించారు. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, శాసనసభ్యులు రాంమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, బి మనోహర్ రెడ్డి, నేవీ ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. ముందుగా హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా దామగుండం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సభా వేదికపై శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు నేవీ అధికారులు జ్ఞాపికను బహూకరించారు.