స్వాతంత్య్ర అనంతరం పలుమార్లు రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని, వాస్తవాలు విస్మరించి సీఎం రేవంత్రెడ్డి రాజకీయ దురుద్దేశంతో బీజేపీ మూడోసారి 400సీట్లతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటు దుష్ప్రచారం
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
విధాత : స్వాతంత్య్ర అనంతరం పలుమార్లు రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని, వాస్తవాలు విస్మరించి సీఎం రేవంత్రెడ్డి రాజకీయ దురుద్దేశంతో బీజేపీ మూడోసారి 400సీట్లతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటు దుష్ప్రచారం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం నాంపల్లి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు ప్రధాని హోదాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ కులాల రిజర్వేషన్ల విషయంలో సీఎంలకు రాసిన లేఖలలో కులాల రిజర్వేషన్లతో దేశం సెకండ్ గ్రేడ్ సిటిజన్ల దేశంగా మారుతుందని పేర్కోన్నట్లుగా లక్ష్మణ్ తెలిపారు. కులాల రిజర్వేషన్లతో వ్యక్తుల్లో ఉన్న టాలెంట్, మెరిట్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అన్నది నెహ్రూనే అని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఆ రకంగా ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. మండల్ కమిషన్ రిపోర్టు ఆధారంగా విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అనులు చేయాలని పార్లమెంట్ లో వీపీ సింగ్ ప్రశ్నిస్తే ఆయనను కాంగ్రెస్ అవహేళన చేసిందని గుర్తు చేశారు.
కులాల పేరు మీద రిజర్వేషన్లు అక్కర్లేదని.. పేదరికాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజీవ్ గాంధీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ చెప్తే.. ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పలుమార్లు అంబేద్కర్ను అవమానించిందని విమర్శించారు. అంబేద్కర్ చేసిన రిజర్వేషన్ ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేదని.. అందుకే ఓడించారని ఆరోపించారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ గౌరవాన్ని పెంచింది బీజేపీ మాత్రమేనన్నారు. మొదటి నుంచి రిజర్వేషన్లను అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయేనని.. బీజేపీ కాదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పట్లో కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక ఇచ్చినా.. 17 ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూ నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనూ బీసీల రిజర్వేషన్లు తగ్గించి.. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచితే హైకోర్టు మొట్టికాయలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ముస్లింలకు రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్లో చేరడం ఖాయం
బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్కు ఎలాంటి గతి పట్టిందో అదే గతి రేవంత్ రెడ్డికి పడుతుందని వ్యాఖ్యలు చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు కాదు… పాము గుడ్డు గుర్తు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలంటూ సెటైర్ విసిరారు. ప్రధాని మోదీ గురించి మాట్లాడేందుకు కేటీఆర్కు సిగ్గు ఉండాలన్నారు. హైదరాబాద్ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలవమన్న భయంతోనే సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతోందని లక్ష్మణ్ విమర్శించారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. దళితులు, ఆదివాసీలకు అధికారం అందించిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.