Etela Rajender : బీసీలకు ఆ పార్టీలతోనే మోసం
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ బంద్కు మద్దతుగా పాల్గొన్న ఈటల, తమిళనాడు తరహాలో శాస్త్రీయ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సీఎం పదవి ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

విధాత, హైదరాబాద్ : బీసీలను మొదటి నుంచి మోసం చేస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు మద్దతుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బంద్ లో ఈటల బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని.. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు అని విమర్శించారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని…21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారు అని ఈటల తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ఒక సారి సర్వే చేసి.. బీసీ కమీషన్ వేశారని..వారికి నిజాయితీ లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ అమలు కాలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు అని..లెక్కలు తీశారని, కానీ అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. నేను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్నారు. బీసీలు మేమెంతో మాకంత కావాలని.. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నాం అన్నారు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందని, కుటుంబమే ఏలుతుందని ఈటల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు అన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రత్వ శాఖలు కూడా ప్రాధాన్యతలేనివేనన్నారు. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు అని ఈటల ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రకటించారని, అంతేకాకుండా కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. అందుకే బీసీల పట్ల బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరు అన్నారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేసిన ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలని, ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జేఏసీ అని. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదని, బీసీ బంద్ విజయవంతం కావడం ఇది తొలిసారి అని, 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు.. చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగబోదని.. మాది యాచన కాదు, పాలించే శక్తి మాకు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సాధ్యం అవుతుందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.