ఆ రెండు పార్టీలకు అధికారమే ముఖ్యం
కేసీఆర్కు తెలంగాణతో పేగుబంధం
విధాత : హైదరాబాద్ ఇక కామన్ క్యాపిటల్ కాదని.. ఓన్లీ తెలంగాణ క్యాపిటల్ మాజీ మంత్రి టి.హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం హరీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆరెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్లకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని.. అధికారమే ఆ రెండు పార్టీలకు ముఖ్యమని విమర్శించారు. తెలంగాణతో కేసీఆర్, బీఆరెస్లది పేగు బంధమన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్ర జరుగుతోందని మరోసారి ఆరోపించారు. మరో పదేళ్లు హైదరాబాద్ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా చేయాలని బీజేపీ-కాంగ్రెస్లు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో హైదరాబాద్ పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని.. అలాంటిది ఇప్పుడు మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు .హైదరాబాద్ను కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్ గెలిపించుకోవాలన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను, హక్కులను, విభజన హామీలను సాధించుకునేందుకు బీఆరెస్ బలంగా నిలబడాల్సిన అవసరముందన్నారు. అందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని, కేవలం ఆరు నెలల్లోనే ఆ పార్టీ నిజరూపమేంటో బయటపడిందని విమర్శించారు.