• Telugu News
  • /Telangana

అనధికార రేషనలైజేషన్ ను ఆపండి , ముఖ్యమంత్రి మాటలు ప్రకటనలకే పరిమితమా … టి.పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్

ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడనీయమని, మూసేసిన వాటిని కూడా తెరిపిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు భిన్నంగా రాష్ట్ర విద్యా శాఖాధికారులు వ్యవరిస్తున్నారని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగేశ్వర్ అన్నారు

Reported by: Subbu | తెలంగాణ‌ | Jun 30, 2024, 7:25 pm IST
Read Time: 5 mins
అనధికార రేషనలైజేషన్ ను ఆపండి , ముఖ్యమంత్రి మాటలు ప్రకటనలకే పరిమితమా … టి.పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్

విధాత, వరంగల్ ప్రతినిధి:ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడనీయమని, మూసేసిన వాటిని కూడా తెరిపిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు భిన్నంగా రాష్ట్ర విద్యా శాఖాధికారులు వ్యవరిస్తున్నారని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగేశ్వర్ అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న ఎస్జీటీ బదిలీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో చాలా పాఠశాలల్లో ఖాళీలు చూపించడం లేదన్నారు. ఆదివారం హన్మకొండలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షలు జి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీల విధానం పై రాష్ట్ర నాయకులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖధికారులను వివరణ అడగగా వారు “విద్యార్థులు ఉంటేనే పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తామని అంటున్నారని అన్నారు. అసలు ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఎలావస్తారు? తల్లిదండ్రులకు విశ్వాసం కలిగే విదంగా పాఠశాలలను తయారు చేయాలన్నారు. అప్పుడు మాత్రమే పాఠశాలలకు విద్యార్థులను పంపిస్తార.

కానీ దీనికి భిన్నంగా ఉన్న పాఠశాలలను మూసివేసే విధంగా రాష్ట్ర విద్యాశాఖాధికారులు వ్యవరస్తున్నారని భోగేశ్వర్ అన్నారు. దీనికంటే ముందు జరిపిన పదోన్నతుల్లో కూడా విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో పోస్టులను నింపలేదన్నారు. ఈ విధంగా ప్రభుత్వం దొంగచాటుగా రేషనలైజేషన్ కు పాల్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆర్భాటాపు ప్రచారానికి, ప్రకటనల వరకే పరిమితం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని అర్థమవుతుందని విమర్శించారు. గతంలో ప్రత్యేక నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, కనీసం సమాచారం ఇచ్చి రేషనలైజేషన్ చేసేవారన్నారు. మిగిలిన పోస్టులను డీఈవో పరిధిలో ఉంచి గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేసేవారన్నారు. ప్రస్తుతం బదిలీల్లో ఆయా ఖాళీలు చూపించకుండా కనిపించకుండా రేషనలైజేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ పోస్టుల అనధికారిక క్రమబద్ధీకరణను టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అన్ని ఖాళీలను చూపించి, బదిలీల అనంతరం మిగిలిన వాటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల వెబ్ ఆప్షన్ ప్రక్రియను మరొక్క రోజు పొడిగించాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్, ఉపాధ్యక్షలు జె. స్వామి, కార్యదర్శి బుచ్చాచారి,ఈదుల వీరస్వామి, జి లక్ష్మి పతి, బెల్లంకొండ పూర్ణచందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.