Harish Rao | 8 నెలల్లోనే 343 మందికి కుక్కకాటు.. చోద్యం చూస్తున్న ప్రభుత్వం: హరీశ్‌రావు

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు

Harish Rao | 8 నెలల్లోనే 343 మందికి కుక్కకాటు.. చోద్యం చూస్తున్న ప్రభుత్వం: హరీశ్‌రావు

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న వీధి కుక్కల దాడి ఘటనలపై ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం అని విమర్శించారు. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు.

నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని గుర్తు చేశారు. ఇటువంటి హృదయవిధారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని పేర్కొన్నారు. చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపిందని, కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

చెత్తతోనే కుక్కల స్వైరవిహారం

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల పారిశుధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద మరింత ఎక్కువైందన్నారు. అంతే కాక సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పని చేయడం లేదన్నారు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు జరిగిన కుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలని, యాంటీ రేబిస్ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. దీంతోపాటు వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేసి, కుక్కల సంఖ్య పెరుగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.