- కక్షపూరితంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం
- మూడుసార్లు ప్రధానిని కలిసినా నిధులివ్వలేదు
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బోగస్ నినాదం
- ఇది వికసిత భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్
- సబ్కా సాత్లో తెలంగాణ రాష్ట్రం లేదా?
- క్విడ్ ప్రోకో కింద ఏపీ, బీహార్లకు నిధులు
- కేంద్రంలో కుర్చీ కాపాడుకోవడమే లక్ష్యం
- సవరణ బడ్జెట్లోనైనా తెలంగాణకు నిధులివ్వాలి
- లేదంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లినట్లే
- పెద్దన్నగా భావిస్తే..దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
- దక్షిణాది రాష్ట్రాలపైనా కేంద్ర ప్రభుత్వం కేంద్రం వివక్ష
- దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం నిర్వహిస్తా
- కేసీఆర్ సభకు రావాలి.. కేంద్రాన్ని నిలదీయాలి
- విలీన ప్రక్రియలో ఎవరున్నారో రేపు తేలుతుంది
- బడ్జెట్లో అన్యాయంపై తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
విధాత, హైదరాబాద్ : వికసిత్ భారత్ 2047 కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిరసనగా బుధవారం శాసన సభలో తీర్మానం ఆమోదించి ప్రధానికి పంపుతామని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు. స్వయంగా తానే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరానని, కేంద్ర-రాష్ట్రాల మధ్య వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరానని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పానన్నారు. వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరామన్నారు. అందుకు భిన్నంగా మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదని మండిపడ్డారు. తాము వివక్ష మాత్రమే అనుకున్నామని, కానీ కేంద్రం కక్షపూరితంగా వ్యవరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అక్కసు వెళ్లగక్కేవారని, కానీ మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని చెప్పారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందని, మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజినల్ రింగ్ రోడ్డుకు.. ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు. ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదన్నారు. కేంద్ర పట్ల స్నేహపూర్వక వైఖరితో తాము వెలుతుంటే చేతగాని తనంగా భావిస్తున్నారని రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించరాదని హెచ్చరించారు. మొదటి నుంచీ ప్రధాని మోదీ తెలంగాణ పట్ల కక్ష కట్టారని, ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ఏ రంగానికీ సహకారం అందించలేదని, వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని విమర్శించారు.
సబ్ కా సాత సబ్కా వికాస్ బోగన్ నినాదమేనా?
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారని, వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదని, ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని దుయ్యబట్టారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు కావాలి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్టదా? అని నిలదీశారు. ఇది మోదీకి గౌరవం తెచ్చిపెట్టదని అన్నారు. తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు 35% ఓట్లు ఇచ్చారని, తెలంగాణకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించిందని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ ప్రధాని సీట్లో కూర్చున్నారని రేవంత్రెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలని, కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం డిమాండ్ చేశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలని ప్రశ్నించారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ఏపీ, బీహార్లకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణకు అన్యాయంపై పార్లమెంటు నిరసన
తెలంగాణ హక్కుల కోసం, బడ్జెట్లో జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతారని రేవంత్రెడ్డి చెప్పారు. విభజన చట్టం ఏపీకి మాత్రమే కాదు.. తెలంగాణకూ వర్తిస్తుందని గుర్తు చేశారు. బడ్జెట్ను సవరించి, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనన్నారు. కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దని హితవు పలికారు. పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటులో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలని కోరారు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరో ఉద్యమానికి బాటలు
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశాలు నిర్వహిస్తామని, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తామని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి సీఎంలకు లేఖ రాశానని తెలిపారు. కేరళ సీఎం కూడా తమతో కలిసి రావాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం శాసనసభలో చర్చకు పెడతామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తామన్నారు. తెలంగాణ హక్కులపై, నిధులపై శాసనసభలో జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని ఆయన కోరారు. చర్చకు హాజరుకాకపోతే కేసీఆర్ కూడా మోదీకి కిషన్రెడ్డి మాదిరిగా మోకరిల్లినట్లుగా భావించాల్సి వస్తుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో… ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో రేపు బయటపడుతుందన్నారు.