విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి

తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు  విజ్ఞప్తి చేశారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించ‌నున్న‌ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎం ప్రిన్స్ ను కోరారు

 

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విధాత):  తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు  విజ్ఞప్తి చేశారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించ‌నున్న‌ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎం ప్రిన్స్ ను కోరారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, అగా ఖాన్ ఫౌండేషన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V తండ్రి, దివంగత ఆగా ఖాన్-IV మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆగా ఖాన్ ఫౌండేషన్‌పై తమ‌కు అత్యంత గౌరవం ఉందని సీఎం తెలిపారు. తెలంగాణలో ఫౌండేషన్ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకుని ఇటీవలే ప్రారంభించుకున్న విషయాన్ని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో పునరుద్ధరించిన కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రారంభోత్సవంలో తాము కలిసిన విషయాన్ని కూడా ఈ సంద‌ర్భంగా సీఎం ప్రస్తావించారు.

 

 మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి

మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసా, మూసా నదుల సంగమంగా ఏర్పడిన మూసీ ఆక్రమణలకు గురికావడంతో పాటు కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని సీఎం కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి చేయాలని ప్రిన్స్ ర‌హీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

 

ఫ్యూచర్ సిటీపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V ఆసక్తి

30 వేల ఎకరాల్లో భార‌త్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీపై ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V ఆసక్తి కనబరిచారు. ఫ్యూచర్ సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం సింగపూర్ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని వివరించారు. ఫ్యూచర్ సిటీని నెట్-జీరో సిటీగా ఏర్పాటు చేస్తామని, దాదాపు 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఉంటుందని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు తెలిపారు.ఇప్పటికే అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం వెల్లడించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 2.5 శాతం ఉందని, దాన్ని 10 శాతానికి పెంచుతామని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు భార‌త్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించ‌నున్న‌ట్లు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు సీఎం తెలిపారు. సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V సీఎం ఆహ్వానించారు. సమ్మిట్‌లో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, వ్యాపార అవకాశాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం వివరించారు.

 

విద్యా, పర్యాటక రంగాల్లో సహకారంపై చర్చ

ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో వివిధ ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు వివరించారు.హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర యూనివర్సిటీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు. పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ పాత్రను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని ఆమె కోరారు.

Latest News