రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం

రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు

  • By: Subbu |    telangana |    Published on : Aug 12, 2025 7:52 PM IST
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు
  • ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లు
  • హైడ్రా అప్రమత్తంగా ఉండాలి
  • కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

విధాత, హైదరాబాద్: రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్డీఆరెఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, విద్యుత్ కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలని, 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. స్కూల్స్, కాలేజీలు, ఐటీ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.