Dharmapuri Srinivas | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Dharmapuri Srinivas | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్లో ధర్మపురి శ్రీనివాస్ జన్మించారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. 1969లో ఎన్ఎస్యూఐ నుంచి తన పొలిటికల్ జర్నీని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్లో కీలకంగా పని చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన డీఎస్.. నిజామాబాద్ అర్బన్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా, 2004 -2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ మంత్రిగా పని చేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎస్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు.
2013 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన డీఎస్.. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పని చేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్తో విబేధించి, కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు డీఎస్.