విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్లో మొత్తం 12 సెగ్మెంట్లకు గాను నాలుగు సీట్లకు మాత్రమే అభ్యర్థులను కాంగ్రెస్ తన తొలి జాబితాలో ప్రకటించింది. మిగిలిన స్థానాలకు మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తొలి జాబితాలో ఇతరుల నుంచి పెద్దగా పోటీలేని స్థానాలను ప్రకటించారు. తొలి జాబితాలోనే తమకు అవకాశం దక్కుతుందని భావించిన కొందరు నేతలు తమ పేర్లు లేక పోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు.ఈ నేతల అనుచరులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు స్థానాల్లో అభ్యర్ధుల ప్రకటన
ములుగు (ఎస్టీ) నుంచి ధనసరి సీతక్క, భూపాలపల్లి (జనరల్ )నుంచి గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ) నుంచి సింగాపురం ఇందిర, నర్సంపేట (జనరల్)నుంచి దొంతి మాధవరెడ్డికి అవకాశం కల్పించారు. ములుగు అభ్యర్థి సీతక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీఆరెస్లోకి ఫిరాయించారు.
గత ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరగా, టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో నర్సంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన దొంతి మాధవరెడ్డి ఓటమిపాలయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఇందిరకు మరోసారి పార్టీ చాన్స్ ఇచ్చింది. ఈ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఎడవెల్లి కృష్ణ తదితరులు టికెట్ ఆశించినప్పటికే మహిళగా ఇందిరకే అవకాశం దక్కింది.
కొందరు నేతల నారాజ్
మహబూబాబాద్ టికెట్ ఆశిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్, వరంగల్ తూర్పు టికెట్ తమదేననే ధీమాతో ఉన్న కొండా సురేఖ, పశ్చిమ ఈసారి తనకే అంటున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డి కొంత నారాజ్ అయ్యారు. ఈ స్థానాల్లో వివిధ కారణాల రీత్యా తొలి జాబితాలో అవకాశం కల్పించలేదని చెబుతున్నారు.
ఎనిమిది స్థానాల్లో ఎదురుచూపులు
మిగిలిన ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. జనగామ, పాలకుర్తి, వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పోటీ ఉన్నందున ఏకాభిప్రాయం అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. జనగామ నుంచి పొన్నాల, కొమ్మూరి పోటీ పడగా అనూహ్యంగా పొన్నాల పార్టీకి రాజీనామా చేయడంతో కొమ్మూరికి లైన్ క్లియరైందని భావిస్తున్నారు.
అయితే ఈ స్థానం నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ను బరిలోకి దింపాలనే యోచన పార్టీ చేస్తున్నట్లు చర్చసాగుతోంది. మరో వైపు బీసీకి అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలో భాగంగా ఓయూ జేఏసీ నేత, కాంగ్రెస్ నాయకురాలు భాగ్యలక్ష్మీ పేరు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డి పేరు దాదాపు ఖరారైనప్పటికీ ఆమె సిటిజన్ షిప్ విషయంలో సమస్య ఉన్నట్లు చర్చసాగుతోంది.
కాగా.. ఆమె స్థానంలో ఆమె కుటుంబ నుంచి ఒకరి పేరు ప్రతిపాదిస్తుండగా మరో ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పోటీపడుతున్నారు. డోర్నకల్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన రాంచంద్రనాయక్, నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్ పోటీపడుతున్నారు. మానుకోట నుంచి పోరిక బలరామ్ నాయక్, తేజావత్ బెల్లయ్యనాయక్, డాక్టర్ మురళీనాయక్ పోటీపడుతున్నారు. వర్ధన్నపేట నుంచి నమిండ్ల శ్రీనివాస్, కేఆర్ నాగరాజు, పరంజ్యోతి, సిరిసిల్ల రాజయ్య పోటీపడుతున్నారు.
వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, ఎన్ఆర్ఎస్ ప్రదీప్ కుమార్ మధ్య పోటీ ఉంది, పరకాల నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా మురళి, గాజర్ల అశోక్ పేర్లు చర్చలో ఉన్నాయి. వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ కారణంగా ఏకాభిప్రాయం అనంతరం ఇక్కడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పేర్లే కాకుండా అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
జాప్యంతో కాంగ్రెస్ మీద ఒత్తిడి అధికారంలో ఉన్న బీఆరెస్ తన అభ్యర్థులను ముందే ప్రకటించడంతో సహజంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీఆరెస్ తమ అభ్యర్థులను ముందుగా ప్రకటించడమే కాకుండా జిల్లాలో రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించడంతో సులభమైంది. పార్టీ అభ్యర్థులను మార్చిన చోట ఆ పార్టీకి ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం సమస్య కొద్దిగా సద్దుమణిగినప్పటికీ జనగామ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పొన్నాల చేరిక నేపథ్యంలో మార్పుంటుందా? అనే చర్చ సాగుతోంది.