నర్మెట్ట సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్ చేసిన సీపీ రంగనాథ్

నర్మెట్ట సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్ చేసిన సీపీ రంగనాథ్
  • భూ వివాదమే కారణం
  • భూ బాధితులపై కేసు నమోదు
  • వరంగల్ సీపీ రంగనాథ్


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, కబ్జాదారులకు భూమిని స్వాధీన పర్చేందుకు యత్నించిన నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


భూతగాదా విషయంలో గత ముప్పై ఏళ్లుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని, కేవలం ధరణి పోర్టర్ లో ఉన్నదన్న సాకును చూపిస్తూ పోలీస్ ద్వారా భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించేందుకు స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్, ఎస్ఐ సహాయ, సహకారాలు అందజేశారని పేర్కొన్నారు.


ఉల్టా బాధితులపై అక్రమ కేసులు నమోదు చేయడంతో బాధితులు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు.


స్థానిక ప్రజల వాంగ్మూలం ఆధారంగా బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు కబ్జాదారులకు స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్, ఎస్ఐలు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇరువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.