Site icon vidhaatha

Deputy CM Bhatti | విద్యుత్తు కేంద్రాలన్నింటి నుంచి ప్రతి వారం నివేదికలు పంపించాలి: డిప్యూటీ సీఎం భట్టి

bhatti

bhatti

థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 17రోజల ఉత్పత్తికి నిల్వలుండాలి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రాంలోని అన్ని విద్యుత్తు కేంద్రాల నుంచి ప్రతి వారం నివేదికలు పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అలాగే థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 17రోజుల ఉత్పత్తితికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచాలని సూచించారు. శనివారం ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్తు కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను భట్టి విక్రమార్య మల్లు ఆదేశించారు.

విద్యుత్తు ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం తద్వారా ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు. ఇక మీదట నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. ఇందుకుగాను వారానికి ఒకసారి విద్యుత్తు కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని ఆదేశించారు. అధికారులకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్తు శాఖలో పని చేయడం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయడమన్నారు. విద్యుత్తు శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామని పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని విద్యుత్తు శాఖ మంత్రి అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తనియా, ట్రాన్స్‌కో జేఎండి శ్రీనివాస్‌, ఎనర్జీ ఓఎస్డీ సురేందర్‌రెడి్ జెన్కో డైరక్టర్లు, సీఈలు పాల్గొన్నారు.

Exit mobile version