పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ వచ్చిపడిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆరెఎస్ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది. పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నప్పటికీ అంతర్గతంగా అధిష్టాన నిర్ణయం పై రగిలిపోతున్నారు.
అభ్యర్థి ప్రకటనతో ప్రకంపనలు
రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఫైర్
పల్లా ఆధిపత్యం పై లొల్లి
ఉద్యమకారులకు మొండిచేయి
రెడ్డి సామాజిక వర్గానికే ఛాన్స్
సుందర్ రాజ్ తీవ్ర అసంతృప్తి
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న
బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి
విధాత ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ వచ్చిపడిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆరెఎస్ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది. పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నప్పటికీ అంతర్గతంగా అధిష్టాన నిర్ణయం పై రగిలిపోతున్నారు. ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులెవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా పై పల్లా ఆధిపత్యమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆరెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరికి నచ్చచెప్పేందుకు పల్లా అధిష్టాన నిర్ణయమని చెబుతున్నట్లు విమర్శిస్తున్నారు.
రాకేష్ రెడ్డిని నిర్ణయించిన బీఆరెస్
నల్గొండ,- వరంగల్,- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆరెఎస్ అభ్యర్థిగా ఏనుగు రాకేష్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నికలొచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఖాళీ అయిన ఈ స్థానానికి పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. బీఆరెఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం వరంగల్ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మరికొందరు ఉద్యమ నాయకులు ప్రయత్నించినప్పటికీ రాకేష్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు.
రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి బీఆరెస్ లోకి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాకేష్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆరెఎస్ లో చేరారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న రాకేష్ రెడ్డి ఆ పార్టీ నుంచి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆరెఎస్ లో చేరారు. ఆ పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నాయకులను కాదని ఇటీవల కాలంలో బిజెపి నుంచి చేరిన వ్యక్తికి అవకాశం కల్పించడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మూడు జిల్లాల పరిధిలో బీఆరెఎస్ నాయకత్వానికి అర్హులైన అభ్యర్థి లభించలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
రాకేష్ రెడ్డి అభ్యర్ధిత్వం పై ఆగ్రహం
రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించడం తమకు ఇష్టం లేదని వరంగల్ జిల్లా నాయకులు చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగానే మంగళవారం రాకేష్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక్క మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మినహా మిగిలిన నాయకులెవరు హాజరు కాలేదు. నామినేషన్ ఘట్టం ముగిసినప్పటికీ రానున్న రోజుల్లో రాకేష్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా నాయకులందరినీ కాదని ఎమ్మెల్యే పల్లా ఒక్కరే రాకేష్ రెడ్డిని ఎలా గెలిపిస్తాడో చూద్దామనే పంతంతో ఉన్నారు. తనకు అధిష్టానం దగ్గర ఉన్నందున అసంతృప్త నాయకులకు నచ్చచెప్పించడం పెద్ద పని కాదనే విశ్వాసంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు నాయకులతో మాట్లాడినప్పటికీ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదని తెలుస్తోంది.
వినయ్ భాస్కర్ అసంతృప్తి?
మాజీ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తన అనుచరుడిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతుడు, విద్యాసంస్థల అధిపతి మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కు టికెట్ ఇప్పించాలని భావించినట్లు సమాచారం. ఆయనకు కుడా చైర్మన్ గా అవకాశం కల్పించినప్పటికీ స్వల్పకాలం మాత్రమే ఛాన్సు దక్కింది. కానీ వినయ్ కి తెలియకుండానే పల్లా చక్రం తిప్పి రాజేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నట్లు చర్చ సాగుతోంది. ఈ పరిణామంతో పార్లమెంటు ఎన్నికలకు కూడా ఒక వర్గం దూరంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఓటమిపాలైనప్పటికీ కూడా అధిష్టానం గుణపాఠం తీసుకోకుండా పనిచేసే తమలాంటి నేతల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏకపక్ష పోకడలతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నే రాజేష్ రెడ్డి బిజెపి నుంచి బీఆరెఎస్ లో చేరడాన్ని వినయ్ వ్యతిరేకించారు. తనకు సంబంధం లేకుండానే పల్లా ఆధ్వర్యంలో ఆయనను బీఆరెఎస్ లో చేర్చుకున్నారు. ఎన్నికల సమయం అయినందున వినయ్ అంతర్గతంగా తన అభిప్రాయాన్ని చెప్పి పట్టించుకోలేదు. ఆ తరువాత కూడా తన మాట చెల్లుబాటు కాకుండా పల్లా వ్యవహరించడం వినయ్ కి రుచించలేదు. వినయ్ కి కూడా అధిష్టానం లోని ముఖ్య నేత కేటీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యునిగా పేరుంది. హరీష్ రావు లతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన మాట కు విలువ లేకపోవడం పట్ల నారాజైనట్లు సమాచారం. ఈ పరిణామం ఏమలుపు తీసుకుంటుందో అనే చర్చ బీఆరెఎస్ వర్గాల్లో సాగుతోంది.
చిచ్చుపెట్టిన అభ్యర్థి ఎంపిక
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది ఎంపీక బీఆరెఎస్ లో చిచ్చు పెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన రాకేష్ రెడ్డికి కేటాయించి, సుదీర్ఘకాలం పార్టీలో ఉంటున్న మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కి టికెట్ దక్కక పోవడం తో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీసీ సంఘాలు బీఆరెఎస్ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినయ్ సన్నిహితుడిగా ఉన్న సుందర్ రాజ్ ఎమ్మెల్సీ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనను కాదని వినయ్ వ్యతిరేకి రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపడం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వినయ్ భాస్కర్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ బీజేపీలో చేరడంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో తన అనుచరున్ని కాదని తన వ్యతిరేకికి టికెట్ కేటాయించడం పట్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా బరిలో నిలవాలని సుందర్ రాజ్ పై అనుచరులు, మద్దతు దారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన మాత్రం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తీవ్ర అసంతృప్తికి లోనైన సుందర్ రాజ్ ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం.
అగ్ర కులాలకే అవకాశం
ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక విషయంలో తొలి నుంచి ఎస్సీ, ఎస్టీ బీసీలను కాదని ఇప్పటివరకు బీఆరెఎస్ రెడ్డి సామాజిక వర్గం లేదా అగ్రకులాల అభ్యర్థి వైపే మొగ్గుచూపుడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ కు ఆ తర్వాత వరదారెడ్డికి ఆ తదుపరి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అవకాశం కల్పించారు తప్ప కింది కులాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శలున్నాయి. మరోసారి రెడ్డి సామాజిక వర్గం వైపే మొగ్గుచూపుడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన తీన్మార్ మల్లన్నకే అవకాశం కల్పించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించింది. ప్రేమేందర్ రెడ్డి సైతం గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆయనకే మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ బీసీకి ఛాన్సు ఇవ్వగా, బీఆరెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గం అభ్యర్ధులను ప్రకటించింది.