Site icon vidhaatha

కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది

త్వరలో హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికీ నోటీసులు
విజయోత్సవ సభలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు
నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటానని వెల్లడి

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మాజీ సీఎం కేసీఆర్‌మీద ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసిందని మెదక్‌ ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత రఘునందన్‌రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. మునుముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ, బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కూడా ఈడీ ఎఫెక్ట్‌ త్వరలోనే ఉంటుందని చెప్పారు. గురువారం మెదక్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకలో రఘునందన్‌రావు ప్రసంగించారు. ‘నిన్న సిద్దిపేటలో సమావేశానికి ఇంకొకరు వస్తారని ఏనాడైనా హరీశ్‌రావు కలగన్నాడా? అని ప్రశ్నించారు. తాను గెలిస్తే తమ పేరు ఢిల్లీ దాకా వినపడుతుందని పోలింగ్‌ కేంద్రాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తన గెలుపు కోసం కష్టపడ్డారని చెప్పారు.

 

వారికి, మెదక్‌ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. గురువారం మెదక్ సాయిబాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలలో బీఆరెస్‌ నేతలు డబ్బుతో గెలవలేరని నిరూపించామని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని అన్నారు. మెదక్‌ పార్లమెంటు గెలిచి.. మోదీకి బహుమతిగా ఇచ్చామన్నారు. ఇక్కడి ప్రతి సమస్యను పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపిస్తానని చెప్పారు. మెదక్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థలలో బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడంలో తాను ఒక్కడిని కావడం సంతోషం ఉందన్నారు. లక్ష కోట్లున్న వెంకటరామిరెడ్డికి ఎంత విలువ ఉంటదో పూటకు బువ్వ లేనటువంటి బీజేపీ కార్యకర్తకు కూడా తమ పార్టీలో అంతే విలువ ఉంటుంది అని చెప్పారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు…
ఎంపి గా గెలిచిన తర్వాత మొదటి సారి మెదక్ వచ్చిన ఎంపీ రఘునందన్ రావు మెదక్ పట్టణంలోని పంచముఖి ఆంజనేయ ముత్తయికోట సిద్ధిరామేశ్వర, కుచన్‌పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ద్విచక్ర వాహన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కార్యదర్శి ఎం.ఎల్ ఎన్ రెడ్డి, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version