ఓట్ల ముందు గ్యారెంటీల గారడీ
గెలిచిన తర్వాత అంకెల గారడీ
ప్రజలను బురిడి కొట్టించే భ్రమల కూర్పు
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మరిచిన బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు
ఈ బడ్జెట్ దశ.. దిశ లేని బడ్జెట్
ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద
హామీల అమలు ప్రస్తావన లేదని ఫైర్
విధాత : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25వార్షిక బడ్జెట్ ఆసాంతం అంతా ఆత్మస్తుతి పరనిందలా ఉందని, ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీతో ప్రజలను భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేశారని మాజీ ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు.అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో హరీశ్రావు బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోగా 31వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 15,470కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఏకకాలంలో రుణమాఫీ ఎలా చేస్తారని, మిగతా నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. లేక రుణమాఫీని వాయిదా వేస్తారా అని నిలదీశారు. కళ్ల ముందు కనిపిస్తున్న హైదరాబాద్ అభివృద్ధిపై రజనీకాంత్ వంటి హీరోలు కూడా ప్రశంసించారని, కాంగ్రెస్ గజనీలకు మాత్రం కనబడటం లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేసినందునే బీఆరెస్ను అన్ని సీట్లలో గెలిపించారన్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని, ఆసరా పెన్షన్ల పెంపు ప్రస్తావనే తీసుకురాలేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని విమర్శించారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీలా ఉన్నదని, ఇది రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపే బడ్జెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ దశ.. దిశ లేని బడ్జెట్ అని మండిపడ్డారు. ఆసరా పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, వృద్ధుల పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. బడ్జెట్లో ఆ ప్రస్తావన ఎందుకు చేయలేదని హరీష్రావు ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే డిసెంబర్లో పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పి జులై నెల గడిచినా వాటి ప్రస్తావన లేదన్నారు. ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు బడ్జెట్లో ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని హరీష్రావు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్లో ఆ ప్రకటన తేకపోవడం దారుణమన్నారు. ఆర్భాటంగా అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారని, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరి కారణంగా ఇప్పటికే 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్రావు గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రతిబించించే విధంగా బడ్జెట్ ఉండాలని, కానీ కాంగ్రెస్ బడ్జెట్లో ఆ మ్యానిఫెస్టో ఛాయలు లేవని హరీశ్రావు విమర్శించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500ఇస్తామన్న హామీ మేరకు 8 నెలల లెక్క తీస్తే కోటి మంది అక్కా చెల్లెళ్లకు 20 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మాపై బురద చల్లే ప్రయత్నం చేశారు.. కానీ గత ప్రభుతం తెచ్చిన దానికంటే 17 వేల కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారని సెటైర్లు వేశారు. ఎక్సైజ్ శాఖ్ ఆదాయంలో 7వేల కోట్లు ఎక్కువ చూపించారని, అంటే గల్లీకో వైన్స్ షాపు పెట్టి తాగుబోతుల తెలంగాణ చేస్తారా అని మండిప్డారు.