Site icon vidhaatha

Telangana | రుణమాఫీపై రైతన్నల ఆందోళనలు.. రోడ్డెక్కుతున్న మాఫీకాని రైతులు

Telangana | రుణమాఫీ ప్రయోజనం దక్కని రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదన్నదానిపై అటు బ్యాంకర్లు..ఇటు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం దక్కడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మకు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఓ రైతు ముందు నడుస్తుండగా డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడెను తలమడుగులో ఊరేగించారు.

ఈ శవయాత్రలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు. బోథ్ లో రుణమాఫీ కాలేదంటూ రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ వాడవాడన బ్యాండుమెళాలతో ఊరేగించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇక పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదంటూ సిద్దిపేట జిట్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రుణమాఫీ జరగలేదని కెనరా బ్యాంక్ ముందు రైతుల ధర్నాకు దిగారు.

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ఇండియన్ బ్యాంక్ ఎదుట రుణమాఫీ కానీ రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. బ్యాంకు షట్టర్లు మూసి ధర్నాకు చేశారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంకు మేనేజర్‌ రైతులకు సర్దిచెప్పడంతో శాంతించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ రైతు వేదిక ముందు రైతుల నిరసన తెలిపారు. రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్నప్పటికీ మాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏలాంటి షరతులు లేకుండా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు.

Exit mobile version