అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తెస్తున్నారని నిరంజన్రెడ్డి ఆరోపించారు
కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేశారని వ్యాఖ్య
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తెస్తున్నారని బీఆరెస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను, బీఆరెస్ నేతలను బద్నాం చేయడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఫల్యాలు తెరమీదకు రాగానే డైలీ సీరియల్లా ఏదో ఒక లీకు విడిచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ కేసులో లీకు వార్తలు ఇలాగే కొనసాగితే లీగల్గా ముందుకెళ్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనా కాలంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం తెలిసినా దాన్ని పట్టించుకోలేదన్నారు. .ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేదన్నారు. రోజు వారీ లీకులతో వార్తలు రాయించడం కూడా నేరమేనని, వార్తలు రాయించడంతో పాటు తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, వైఎస్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్తారా..? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అని అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఢిల్లీ ఇష్యూగా పక్కనపెట్టామని తెలిపారు. కేసీఆర్కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని సీఎం పదవిలో ఉండి రేవంత్ మాట్లాడడం అవివేకమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లైవ్లో దొరికిన రేవంత్కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గత బీఆరెస్ ప్రభుత్వంపైన విమర్శలు చేయటం తప్ప చేసింది ఏమి లేదేని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ బోగస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ విత్తనాల కోసం రైతలు క్యూలైన్లు కట్టడం, లాఠీ చార్జిలు చేయడం సాగుతుందని విమర్శించారు.