Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలతో పాటు ఉక్కపోత కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చల్లదనం కోసం ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు.
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీలకు తగ్గకుండా, అంతకుపైనే భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండలకు జనాలు ఉక్కిరిబిక్కిరికి గురవుతూ.. వడదెబ్బ భారీన పడుతున్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల పరిధిలో 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. ఒక వేళ బయటకు వస్తే తలకు రుమాలు కట్టుకోవాలని, గొడువు నీడన ఉండాలని సూచించారు. శరీరం డీహైడ్రేట్కు గురి కాకుండా కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, నిమ్మకాయ రసం వంటి ద్రావణాలను తీసుకోవాలన్నారు.
