Heavy Rains | హైద‌రాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతం( Bay of Bengal )లో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం( Low Pressure ) తీవ్ర అల్ప‌పీడ‌నంగా బ‌ల‌ప‌డిన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఇవాళ, రేపు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ 24 తేదీన ఉమ్మడి మహబూబ్​నగర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని తెలిపింది. 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున చెట్ల కింద ఉండ‌కూడ‌ద‌ని రైతుల‌ను హెచ్చ‌రించారు. ప‌శువులు, గొర్రెల కాప‌రులు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

నైరుతి రుతుపవనాలు విరమణ సమయంలో ఈశాన్యగాలుల రాష్ట్రంలో ప్రవేశిస్తుంటాయని తెలిపారు. ఇవి పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నాయని అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్​లో తుపానులు ఎక్కువగా ఏర్పడే అవకాశాలుంటాయని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతున్న ప్రాంతం గుర్తింపదగ్గ అల్పపీడనంగాను తరువాత రాగల 12 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.