Rains | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )ను మరోసారి వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు( Heavy Rains ) వరి పంటతో పాటు ఇతర పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. రైతులు( Farmers ) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతం( Bay of Bengal )లో నిన్న ఉదయం ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ వాయుగుండం ఈనెల 26 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈనెల 27వ తేదీ ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈజిల్లాల్లో 7 సెం.మీ. నుంచి 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈనెల 25, 26వ తేదీల్లో అక్కడక్కడ కాస్త జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 27 తర్వాత అల్పపీడనం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణపై పడుతుంది.
