పాలమ్మిన పూలమ్మిన అంటూ నవ్వులు పండించిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి
బాలనగర్ యూనివర్సిటీపై చర్యలకు ఆదేశాలు
విధాత, హైదరాబాద్ : పాలమ్మిన పూలమ్మిన అంటూ నవ్వులు పండించిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి అక్రమాలు, భూ ఆక్రమణలు..ఆక్రమ నిర్మాణాలు ఒక్కొక్కటి గా వెలుగు చూస్తూ ఉండడం చర్చనీయాంశమవుతుంది. తాజాగా మల్లారెడ్డి బాలానగర్లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆప్ క్యాంపస్ కేంద్రంపై చట్టపర చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారు ప్రాంతాలైన దూలపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ, బాలానగర్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపెస్ నిర్మించడంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు క్యాంపస్లను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నారని, వాటిని చేపట్టకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం వర్సిటీలపై చర్యలకు ఆదేశించింది. తదుపరి విచారణను జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి తిరిగి జూలై 24కు వాయిదా వేశారు. ఒకవేళ మల్లారెడ్డి స్థాపించిన వర్సిటీలు అక్రమం అని తేలితే క్యాంపస్ను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.