ప్రభుత్వ హాస్టల్స్ అంటేనే కనీస మౌలిక వసతుల లేమికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ప్రభుత్వాలు మారినా సర్కారీ హాస్టల్స్ దుస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు
ఆందోళన బాటలో విద్యార్థులు
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ హాస్టల్స్ అంటేనే కనీస మౌలిక వసతుల లేమికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ప్రభుత్వాలు మారినా సర్కారీ హాస్టల్స్ దుస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. అది యూనివర్సిటీ హాస్టల్స్ అయినా..లేక గురుకుల హాస్టల్స్ అయినా సమస్యలలో మాత్రం తేడా లేదు. తాజాగా చోటుచేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్లో మౌలిక వసతుల లేవంటూ తరుచు ఏదో ఒక హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. లేడీస్ హాస్టల్స్ విద్యార్థినిలు హాస్టల్లో నెలకొన్న నీళ్ల కొరతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తాగడానికి, వాడటానికి సరిపడ నీళ్లు దొరకడం లేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమ ఆందోళనతో అధికారులు 1000మంది విద్యార్థులకు ఒక ట్యాంకర్ పంపిస్తే ఆ నీళ్లు ఎందుకు సరిపోతాయని నిలదీశారు. హాస్టల్స్ నిర్వాహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
కుళ్లిన కూరగాయలతో నిరసన
కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా నాందేవ్ ఎస్సీ ప్రభుత్వ హస్టాల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కుళ్లిన కూరగాలను పడబోసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లోనాణ్యత లేని భోజనం పెడుతున్నారని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనం ఎవరైనా తింటారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపైన వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింజేసే ప్రయత్నం చేశారు.