నవంబరు నాటికి చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా కమిషనర్
మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువు, కూకట్పల్లిలోని నల్లకుంట చెరువు అభివృద్ధి పనులు నవంబరు నాటికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

విధాత, హైదరాబాద్ : మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువు, కూకట్ పల్లిలోని నల్లచెరువు అభివృద్ధి పనులు నవంబరు నాటికి పూర్తి కావాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఈ రెండు చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ రెండుచెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధిచెందాలని సూచించారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి వచ్చే ఇన్లెట్ల అభివృద్ధిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్ బయటవైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని.. చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండాలన్నారు. 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని.. అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు.
శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశం..
ఓ వైపు హైటెక్ సిటీ, మరోవైపు శిల్పారామం ఉన్నందునా..తమ్మిడికుంట చెరువు ప్రధాన ప్రవేశ మార్గం కూడా అటువైపే ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నల్లచెరువు చుట్టూ పాత్ వేను విశాలంగా అభివృద్ధి చేస్తే.. స్థానికులు పెద్దయెత్తున వాకింగ్ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. అలాగే చెరువు ప్రధాన ప్రవేశ ద్వారం విస్తీర్ణం పెంచాలని.. ఆ పక్కనే పిల్లలు, పెద్దలు సేదదీరే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు ఇన్లెట్, ఔట్లెట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. చెరువులోకి మురుగు నీరు కలవకుండా.. నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులకు సూచించారు. గతంలో 17 ఎకరాల మేర ఉన్న చెరువు ఆక్రమణలను తొలగించి 27 ఎకరాలుగా తీర్చిదిద్దుతున్న తీరును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.