KTR | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి గుండు సున్నానే : కేటీఆర్‌

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని, కనీసం బడ్జెట్‌ మొత్తంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధకరమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

KTR | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి గుండు సున్నానే : కేటీఆర్‌

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష
బీజేపీకి 8ఎంపీలిచ్చినా నిష్ప్రయోజనమే
బడ్జెట్‌ల తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం
బీఆరెస్‌ ఎంపీలుంటే నిలదీసేవారు
బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ :కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని, కనీసం బడ్జెట్‌ మొత్తంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధకరమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ధ ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, దక్కింది మాత్రం శూన్యమన్నారు. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని, ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ఆర్థిక మంత్రి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అందుకే తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోందన్నారు. పార్లమెంట్‌లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని, ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లన్నారు. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.

విభజన చట్టం ప్రస్తావనలో తెలంగాణ ఊసెత్తలేదు

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదని, సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదని, రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారని, ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారని, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి ద్వేషం లేదు, సంతోషమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని గుర్తు చేశారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని, ఐఐఎం సహా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని, మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కేంద్రం స్పందించలేదని ఆవేధన వ్యక్తం చేశారు.